చిట్కాలు ఏమిటి?? చిటికెలో సులువుగా ఆరోగ్యాన్ని చక్కబెట్టే పద్ధతులు. ఆరోగ్యం ఎపుడూ మన చేతుల్లోనే ఉంటుంది. అది ఏమైనా అల్లరి చేస్తే దాన్ని బుద్దిగా సరిచేయాల్సిన బాధ్యత మనదే. అయితే ఆ పద్ధతులు మర్చిపోయి మందమతులుగా మారిపోయి, ఎం చేయాలో తెలియక సతమతమవుతుంటారు ఒకప్పటిలా అమ్మమ్మలు, నాన్నమ్మలు కలిసి ఉండక ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడంతో కొందరికి జబ్బు చేసినపుడు దిక్కు తోచక నేరుగా డాక్టర్ దగ్గరకు పరుగు పెడుతుంటారు. ముఖ్యంగా ఇప్పటి ఆహారంలో వచ్చేసిన మార్పులు, మారిపోయిన మన జీవన శైలికి అందరికి సులువుగా వచ్చేస్తున్న తియ్యతియ్యని చేదైన జబ్బు అదేనండి షుగర్ గా పిలుచుకునే మధుమేహం.
షుగర్ అనేది అందరి శరీరంలో సాధారణంగా ఉంటుంది అయితే దాని స్థాయి పెరగడం వల్ల సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ షుగర్ రక్తంలో పెరిగితే తిరిగి తగ్గడం చాలా కష్టమని అసలు తగ్గదనే భయంతో మందుల మీద ఆధారపడుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ చిట్టి చిట్టి చిట్కాలను పాటించి చూడండి షుగర్ తిరిగి సాధారణ స్తాయిలోకి సులువుగా వచ్చేస్తుంది.
◆ నేరేడు గింజలు షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు గింజలను మెత్తగా దంచి అన్నంలో కలుపుకుని తినవచ్చు లేకపోతే మజ్జిగ కలిపి తాగవచ్చు. మదుమేహాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యము నేరేడు లో ఉంది.
◆ మెంతులను 8 గంటలు నానబెట్టి తరువాత పలుచని వస్త్రంలో వేసి 24 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. అపుడు అవి మొలకలు వస్తాయి. వీటిని ఎండబెట్టి బాగా ఎండిన తరువాత దోరగా వేయించి, ఎండుమిర్చి వెల్లుల్లి జతచేసి కారప్పొడిలా తయారుచేసుని అన్నంలో తినాలి. దోసెలు, ఇడ్లి వంటి టిఫిన్లలోకి కూడా ఇది ఎంతో బాగుంటుంది. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గి సాధారణ స్థితిలోకి వస్తాయి.
◆ గింజ తీసివేసిన ఉసిరికాయలను, పసుపు కొమ్ములను సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. దీనిని ప్రతిరోజు అరచెంచా నుండి ఒక చెంచా వరకు రెండు పూటలా గ్లాసు మజ్జిగలో కలిపి తాగాలి. ఇలా చేస్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. షుగర్ కంట్రోల్ లోకి వచ్చేవరకు ఇలా చేస్తూ అప్పటిదాకా వాడుతున్న మందులను కూడా కొనసాగించాలి. షుగర్ కంట్రోల్ రాగానే మందులను తగ్గించి ఇదే పద్ధతిని వారంలో రెండు లేదా మూడు రోజులు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
◆ చాలా మందికి తెలియని ఆకు పొడపత్రి. ఇది షుగర్ ను నియంత్రణలో ఉంచడంలో గొప్పగా పనిచేస్తుంది. ఆయుర్వేద దినుసులు అమ్మేచోట ఇది దొరుకుతుంది. పొడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్లు, నేరేడు గింజల లోపలి పప్పు సమాన భాగాలుగా తీసుకుని బాగా ఎండిన తరువాత దీన్ని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక చెంచా ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే షుగర్ ని సులువుగా నియంత్రించుకోవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి రోజుకు రెండు నుండి మూడు పూటలా తీసుకోవాలి.
చివరగా…..
షుగర్ ఉన్నవారు చక్కెర కు దూరంగా ఉండాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ పైన చెప్పుకున్న చిట్టి చిట్టి చిట్కాలు ఆచరిస్తే షుగర్ మన ఒంట్లో నుండి పారిపోతుంది