మధ్య తరగతి కుటుంబాల్లో సాధారణంగా కనిపించే అలవాటు ఒకటి ఉంటుంది. రాత్రి పూట మిగిలిపోయిన అన్నం, కూరలు ఏవైనా సరే ఆ ఇంటి ఇల్లాలు ఉదయం మళ్ళీ వేసి చేసుకుని తన పొట్టలోకి తోసేస్తూ ఉంటుంది. కష్టం విలువ తెల్సిన వారికి డబ్బు సంపాదన, ఆహార వృధా రెండిటి గూర్చి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. అయితే రాత్రి మిగిలిన ఆహారాలు మళ్ళీ ఉదయం తినడం ఒక ఎత్తైతే చల్లగా తినలేమని రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం ఫ్రైడ్ రైస్ గానో, మిగిలిన కూరలు మళ్ళీ వేడి చేసుకుని తినడమో చేస్తుంటారు. దీనివల్ల రుచితో పాటు వేడిగా ఉండటం వల్ల కాస్త ఇష్టంగా కూడా తింటామని, ఆహార వృధా అరికడుతున్నామని వారి భావన. వంట చేయాలని అనిపించనప్పుడు రిఫ్రిజిరేటర్లో దాచిన పదార్థాలు బయటకు తీసి మైక్రోవేవ్లో వేడెక్కించి తినడం వంటిది కసిగా బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళ విషయంలో కూడా గమనిస్తుంటాం. అయితే కొన్ని ఆహారాలు వండిన తరువాత మళ్లీ వేడెక్కించకూడదనేది నిపుణుల అభిప్రాయం. ఆ పదార్థాలు ఏమిటి?? వాటి నష్టం ఏమిటి కింద ఉన్నాయి చదవండి మరి.
బచ్చలికూర
బచ్చలి కూర తో చేసిన ఏ వంటకం అయినా వండిన తరువాత అందరూ తినగా మిగిలిపోతే దానిని రిఫ్రిజిరెట్ చేసినా లేదా బయటి వాతావరణంలో ఉంచినా, తరువాత మళ్ళీ తినే ఉద్దేశం ఉంటే తినవచ్చు కానీ తిరిగి వేడి చేయకూడదు. ఇలా తిరిగి వేడి చేయడం వల్ల బచ్చలి కూరలో ఉన్న నైట్రేట్లు మళ్లీ వేడిచేస్తే నైట్రైట్ లు గా(క్యాన్సర్ కారక పదార్ధం) మారుతాయి. దీని వల్ల భవిష్యత్తులో కాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది.
బీట్రూట్
బచ్చలికూర మాదిరిగా, బీట్రూట్ లో నైట్రేట్లు ఉంటాయి. అందువల్ల వంట చేసిన వెంటనే తినాలి తిరిగి వేడి చేయకూడదు. అంతే కాదు ఇందులో అధికంగా లభ్యమయ్యే కార్బోహైడ్రేట్స్ మళ్ళీ వేడి చేయడం అనే ప్రక్రియ వల్ల వేడి చేసేటపుడు జరిగే రాసాయన చర్య వల్ల విషపూరితంగా మారతాయి. హిమోగ్లోబిన్ ను పెంచే సామర్థ్యము కూడా తగ్గిపోతుంది.
బంగాళాదుంపలు
బంగాళాదుంప అనేక ప్రయోజనాల తో నిండిన గొప్ప పిండిపదార్థాల ( కార్బోహైడ్రేట్స్) సమ్మేళనం. అవి వండిన మరుసటి రోజు మళ్ళీ వేడి చేసి తినేటప్పుడు వాటిలో కార్బోహైడ్రేట్స్ విచ్చినమైపోయి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేవు, పైగా ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయే తప్ప ప్రయోజనాలు శూన్యం.
గుడ్లు
ఉడికించిన గుడ్లను తినడం శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అలాంటి గుడ్డు ను తిరిగి వేడి చేయడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో టాక్సిన్ లు అందించినవాళ్ళం అవుతాము. మరియు ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు దారితీస్తుంది.
పుట్టగొడుగులు
ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వాటిని తిరిగి వేడి చేస్తే అవి మీ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవిగా రూపాంతరం చెందుతాయి. పుట్టగొడుగులను ఉడికించినట్లయితే, వాటిని వెంటనే తినాలి లేదా మరుసటి రోజు వరకు ఉన్నా కనీసం చల్లగా ఉండాలి.
అన్నం
తెలుగు రాష్ట్రాల్లో అన్నం ముఖ్యమైన ఆహారం. కొందరు మూడు పూటలా అన్నమే తినే కుటుంబాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న అన్నం అమృత పదార్థం. అయితే అన్నాన్ని మరుసటిరోజు వేడి చేయడం వల్ల వీటిలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నమై అవి టాక్సిన్లు గా మారతాయి. బయట దొరికే ఫ్రైడ్ రైస్ అయినా ఇంట్లో చల్లగైన అన్నాన్ని ఇలా ఫ్రైడ్ రైస్ గా తిన్నా ప్రమాదమే. రాత్రి పూట అన్నం మిగిలితే మరుసటి రోజు నేరుగా ఏదైనా కూరలతో తినడం లేదా పెరుగు అన్నంగా చేసుకోవడం అత్యుత్తమం.
చివరగా…..
ఆరోగ్యం కావాలంటే ఆహారపదార్థాన్ని కావాల్సినంత వండుకుని తాజాగా ఉన్నపుడే తినడం అత్యుత్తమం. లేకపోతే జీవితంలో జబ్బుల చిట్టా మొదలవ్వక తప్పదు