ఆహారంతోనే ఆరోగ్యం అనే విషయం అందరికి తెలిసినదే. మన ఆరోగ్యాన్ని కాపాడేది మనం తీసుకునే సమర్థవంతమైన ఆహారపదార్థాలే. అయితే దురదృష్టం కొద్ది మనం నేటి సమాజంలో వాణిజ్య పరంగా పొందుతున్న ఆహారం చాలా వరకు కలుషితమే. ఏదైనా కొనాలి, ఉప్పు, పప్పు వంటివి కొనుగోలు చేయాలి అంటే నేరుగా సూపర్ మార్కెట్ లకు, రిలయన్స్ మార్ట్ లకు వెళ్లిపోతున్నాం. అక్కడ కళ్ళకు ఇంపుగా కనిపించే వాటిని చూసి తృప్తి చెంది పది కాదు వంద ఎక్కువ అనిపించినా కొంటుంటాం. అయితే రైతు దగ్గర కొనుగోలు చేసే వాటి నాణ్యత కంటే ఈ సూపర్ మార్కెట్ లలో ఉన్నవి గొప్పగా అనిపించచ్చు. కారణం గోధుమలు, బియ్యం వంటివి మిల్లులలో పాలిష్ చేసి సన్నగా నాజూగ్గా ఉండేట్టు కళ్ళకు చూడటానికి బాగుండేట్టు చేస్తారు.
ముఖ్యంగా బియ్యం గూర్చి చెప్పాలంటే బాగా పాలిష్ చేసి అమ్ముతుంటారు. బియ్యాన్ని ప్యాకేజ్ లలో అమ్ముతున్న కార్పొరేట్ కంపెనీలు వాటిని బాగా పాలిష్ చేయడం వల్ల అందరికి నచ్చేస్తాయ్. అంతేకాదు వండినపుడు అన్నం మెతుకు పరిమాణం కూడా ఆకర్షించేట్టు ఉంటుంది. అయితే ఈ నచ్చడం అనే మాయలో పడి మనం ఆరోగ్యానికి అసలు ఇవి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయాన్ని మర్చిపోతున్నాం.
శరీరానికి ఫైబర్ ఎంత గొప్పదో అందరికి తెల్సిన విషయమే. అయితే ఈ విషయంలో బియ్యం గోధుమలు వంటి వాటి నుండి మనం చాలా నష్టపోతున్నాం అనే విషయం ఎవరికి పెద్దగా తెలియదు.
బియ్యం గోధుమలు. పాలిష్ చేయడం వల్ల మరియు, సజ్జలు, జొన్నలు, రాగులు వంటి తృణధాన్యాల పిండిని ఫ్యూరీఫై చేసి అమ్ముతున్న వాటిని కొని వాడటం వల్ల మనం ఎంతగా నష్టపోతున్నామో ఒక్కసారి దిగువ చూడండి.
పాలిష్ చేయడం వల్ల కోల్పోతున్న పోషకాలు
థయామిన్ ౼ 86%
రిబోఫ్లవిన్ ౼ 70%
నియాసిన్ ౼ 86%
విటమిన్ బి6 ౼60%
ఇనుము ౼84%
ఫోలిక్ ఆమ్లం ౼ 70%
పాస్పరస్ ౼ 78%
కాపర్ ౼ 75%
క్రోమియం ౼ 87%
మెగ్నీషియం ౼ 72%
మాంగనీస్ ౼ 71%
జింక్ ౼ 71%
పీచు పదార్థం ౼ 68%
కాల్షియం ౼ 50%
పైన పొందుపరిచిన పోషకాలను కోల్పోతున్న వివరాలు చూస్తే మనం తీసుకుంటున్న ఆహారంలో మనం పొందుతున్న పోషకాల శాతం కేవలం 10 నుండి 30% లోపు మాత్రమే అని అర్థమవుతుంది. కేవలం 10 నుండి 30 % లోపు పోషకాలను కూడా మనం సరైన విధానంలో తీసుకుంటున్నామా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. ముఖ్యంగా ప్రతి ఒకటి ఇన్స్టంట్ గా దొరుకుతున్నాయని బయట కొనుగోలు చేసే పిండి లో కల్తీ ఎక్కువ మరియు ధర కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం ప్యాక్ చేసిన విధానం ను చూసి ఇలాంటి వాటిని కొనడం వల్ల కడుపు నిండవచ్చేమో కానీ పోషకాలు కోల్పోయిన ఆహారాన్ని తీసుకుంటున్నామని గుర్తించలేం.
చివరగా……
పైన చెప్పుకున్నదాన్ని బట్టి మనం తీసుకునే వాటిలో మనకు సమృద్ధిగా పోషకాలు అందాలంటే ముఖ్యంగా తృణధాన్యాలను సొంతంగా మరపట్టించుకుని వాడుకోవడం, ముడిబియ్యాన్ని ఉపయోగించడం అత్యుత్తమం.